Tuesday, October 1, 2024
Homeక్రైంకుమారుడు చేసిన తప్పుకు తల్లిని చెట్టుకు కట్టేశారు

కుమారుడు చేసిన తప్పుకు తల్లిని చెట్టుకు కట్టేశారు

Date:

కుమారుడు చేసిన తప్పుకు ఓ తల్లి శిక్ష అనుభవించింది. కర్ణాటక రాణేబెన్నూర్ తాలూకా అరెమల్లాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు తాను ప్రేమించిన అదే గ్రామానికి చెందిన యువతితో పారిపోయాడు. దీంతో యువతి కుటుంబం ఆగ్రహంతో ఊగిపోయింది. యువకుడి ఇంటికి వెళ్లి అతడి తల్లి 50 ఏళ్ల హనుమవ్వపై దాడి చేసింది. అనంతరం ఆమెను ఇంట్లో నుంచి వీధిలోకి లాక్కొచ్చి విద్యుత్ స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు.

ఈ ఘటన నాలుగు రోజుల క్రితం అంటే ఏప్రిల్‌ 29న జరగగా తాజాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హనుమవ్వ కుమారుడు మంజునాథ్‌, అదే గ్రామానికి చెందిన పూజ అనే యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, వీరి ప్రేమను అంగీకరించకపోవడంతో ఇద్దరూ ఇటీవలే గ్రామం విడిచి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పూజ కుటుంబీకులు యువకుడి తల్లిపై దాడి చేసి దారుణంగా కొట్టి అవమానపరిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని బాధిత మహిళను రక్షించారు. మహిళ ఫిర్యాదు మేరకు ఐపీసీలోని 324, 354 బీ, 504, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్‌ చేశారు.