అవినీతి నిర్ములనే తమ ప్రభుత్వ లక్ష్యమని చెపుతున్న ప్రభుత్వాలు మాటలకే పరిమితమైనట్లుగా తెలుస్తుంది. ప్రజలకు జవాబుదారిగా ఉంటూ, ప్రజల కోసం పని చేయాల్సిన ప్రభుత్వ అధికారులు అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రజలను మామూళ్ల పేరుతో జలగల్లా పీల్చుకుతింటున్నారు. ఒకప్పుడు ఎక్కడో ఒక దగ్గర, ఎప్పుడో ఒక చోట ఎసిబి అధికారులకు అవినీతి అధికారులు దొరికేవారు కానీ ఇప్పుడు రోజురోజుకు అవినీతి అధికారుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు వివిధ శాఖలకు చెందిన ముగ్గురు అధికారులు ఏసీబీకి చిక్కారు.
నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ రూ.18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఆస్పత్రిలో ఫార్మసీకి అనుమతి ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయగా.. సమాచారం అందుకున్న అధికారులు పక్కా ప్రణాళికతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆర్టీసీ డ్రైవర్పై శాఖా పరమైన కేసు కొట్టివేసేందుకు హుజూరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశారు. ఎల్కతుర్తి హోటల్లో ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా.. రంగంలోకి దిగిన ఏసీబీ ఆయన్ని అరెస్టు చేసింది. ఆసిఫాబాద్లో ఎస్సై రాజ్యలక్ష్మి రూ. 25వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి ఆమె రూ.40 వేలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.