Sunday, October 6, 2024
Homeక్రైంఒకరు ప్రేమించాలని.. మరొకరు పెళ్లి చేసుకొవాలని

ఒకరు ప్రేమించాలని.. మరొకరు పెళ్లి చేసుకొవాలని

Date:

ఒకే వీధిలో ఉండే ఇద్దరు యువకులు.. ఓ యువతి దారుణంగా హింసించారు.. పెళ్లి చేసుకోవాలని ఒకరు, ప్రేమించాలని మరొకరు వేధించారు. తాము చెప్పినట్లుగా వినకపోతే వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లలో ఫొటోలను పెడతామని బెదిరించారు. దీంతో ప్రేమోన్మాదుల వేధింపులు తాళలేక చివరకు ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. 

నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన కొత్త రామలింగం రజిత దంపతులకు కుమారుడు, కుమార్తె కల్యాణి(18) ఉన్నారు. కల్యాణి పాలిటెక్నిక్ పూర్తి చేసి హైదరాబాద్ ప్రైవేట్ ఉద్యోగం చేసింది. కొంతకాలంగా ఆమె ఇంటి వద్దే ఉంటోంది. ఒకే గ్రామానికి చెందిన ఆరూరి శివ, కొమ్మనబోయిన మధులు స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. ఒకే ఊరు వారు కావడంతో ఆరూరి శివ, కొమ్మనబోయిన మధులతో కళ్యాణికి పరిచయం ఉంది. అయితే శివ, కొమ్మనబోయిన మధులు కల్యాణిని ఇష్టపడుతున్నారు. వీరిద్దరూ కొద్దిరోజుల కిందట కల్యాణి ఫోన్ నెంబర్ ను తెలుసుకొని ఆమెకు
తరచూ ఫోన్లు చేయడం ప్రారంభించారు. ఒకే ఊరు కావడంతో ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకుని తనను ప్రేమించాలని శివ, తనను పెళ్లి చేసుకోవాలని మధులు అడుగుతున్నారు. వీరిద్దరి ప్రేమ, పెళ్లి విషయాన్ని కళ్యాణి నిరాకరించింది. వారితో మాట్లాడడం కూడా బంద్ చేసింది. దీంతో శివ మధులిద్దరూ.. వాట్సాప్ లో ఆమె డీపీగా (డిస్ప్లే పిక్చర్) పెట్టుకున్న ఫొటోలను తీసుకుని వాటిని తమ వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో.. స్టేటస్ గా పెట్టుకుంటామని బెదిరించారు. చెప్పినట్లు వినాలంటూ పదే పదే టార్చర్ పెట్టడంతో ఇద్దరు యువకులు వేధింపులు తాళలేక కల్యాణీ ఈ నెల 6వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు కళ్యాణి మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆ తర్వాత నల్లగొండలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కళ్యాణి మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

తమ కుమార్తె మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తుల పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తన ఆత్మహత్యకు కారకులు శివ, మధులేనని కళ్యాణి జడ్జికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. కళ్యాణి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, నిందితులు శివ, మధులు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.