Friday, September 20, 2024
Homeక్రైంఎస్‌బీఐ పేరుతో ఫేక్‌ సందేశాలు..

ఎస్‌బీఐ పేరుతో ఫేక్‌ సందేశాలు..

Date:

ఎస్‌బీఐ ఖాతా రివార్డ్‌ పాయింట్స్‌ ఉన్నాయని.. వాటిని క్లైమ్‌ చేసుకునేందుకు ఎస్‌బీఐ రివార్డ్‌ పాయింట్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటూ ఓ ఫేక్‌ మెస్సేజ్‌ వాట్సాప్‌లతో పాటు మెస్సేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో రివార్డ్‌ పాయింట్ల పేరుతో వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. నకిలీ సందేశాలను చూసి స్పందించొద్దని సూచించింది. వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకు వివరాలను సైతం ఎవరితో వెల్లడించొద్దని చెప్పింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ అధికారిక ఎక్స్‌ (ట్విట్టర్) అకౌంట్‌ ద్వారా ఈ హెచ్చరికలు చేసింది. రివార్డ్‌ పాయింట్ల రిడీమ్‌ చేసుకునేందుకు లింక్‌ని ఓపెన్‌ చేయాలని చెబుతుందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ లింక్‌ను ఓపెన్‌ చేయొద్దని.. అలాగే మరెవరికీ షేర్‌ చేయొద్దని సూచించింది.

అలా చేస్తే మోసగాళ్ల బారినపడే ప్రమాదం ఉంటుందని తెలిపింది. ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్‌ల ద్వారా ఎస్‌బీఐ లోగోను వాడుతూ సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లుగా పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఎస్‌బీఐ బ్యాంక్‌ రివార్డ్‌ పాయింట్ల పేరుతో ఫేక్‌ మెసేజెస్‌ వస్తుండడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి తరహా మోసాలకు నేరగాళ్లు పాల్పడిన సందర్భాలున్నాయి. ఇక ఫేక్‌ మెసేజ్‌లలో ‘ప్రియమైన కస్టమర్, మీ ఎస్‌బీఐ నెట్‌బ్యాంకింగ్ రివార్డ్ పాయింట్‌ల (రూ.9980.00) గడువు నేటితో ముగుస్తుంది. ఇప్పుడు ఎస్‌బీఐ రివార్డ్ యాప్ ఇన్‌స్టాల్ ద్వారా రిడీమ్ చేసుకోండి. నేరుగా మీ ఖాతాలో నగదు డిపాజిట్ అవుతుంది’ అంటూ ఫేక్‌ మెసేజ్‌ వస్తున్నది. ఈ క్రమంలో కేంద్రం అప్రమత్తం చేస్తూ తెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలను లింక్‌లను క్లిక్‌ చేయొద్దని.. పాస్‌వర్డ్‌, క్రెడిట్‌కార్డుల వివరాలు ఎవరికీ చెప్పొద్దని కేంద్రం సూచించింది.