Saturday, October 5, 2024
Homeక్రైంఎస్పీ ఆఫీసు ముందే భార్యను చంపిన కానిస్టేబుల్

ఎస్పీ ఆఫీసు ముందే భార్యను చంపిన కానిస్టేబుల్

Date:

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన కానిస్టేబుల్ జిల్లా ఎస్పీ కార్యాలయం ముందే తన భార్యను దారుణంగా పొడిచి చంపిన సంఘటన కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలో జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లోక్‌నాథ్‌ అనే వ్యక్తి హసన్‌ జిల్లాలోని హసన్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఓ భూమికి సంబంధించిన విషయంలో లోక్‌నాథ్‌కు ఆయన భార్య మమతకు మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో మమతను లోక్‌నాథ్‌ రోజూ కొట్టడం, తిట్టడం చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో లోక్‌నాథ్ తనను హింసిస్తున్నాడని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు మమత సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. దాంతో ఆమెను వెంబడించిన లోక్‌నాథ్‌ ఎస్పీ కార్యాలయం ముందే కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. అక్కడే ఉన్న పోలీసులు హుటాహుటిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ భూమికి సంబంధించి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, అదే ఆమె హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.