పశ్చిమ బెంగాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టీఎంసీ నేత మోనోబత్రా జానా భార్య ఫిర్యాదు మేరకు ఎన్ఐఏ బృందం, సీఆర్పీఎఫ్ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎన్ఐఏ అధికారులు తమ ఇంట్లోకి ప్రవేశించి కొట్టారని టీఎంసీ నేత భార్య ఆరోపించారు. అధికారులు తన గౌరవానికి భంగం కలిగించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. భూపతినగర్ పోలీస్స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
2022లో జరిగిన బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ బృందం వెళ్లింది. ఈ సమయంలోనే ఎన్ఐఏ బృందం ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోల్కతాకు తీసుకువస్తున్న సమయంలో ఎన్ఐఏ బృందంపై దాడి జరిగింది. గ్రామస్తులు ఎన్ఐఏ బృందం కాన్వాయ్ను చుట్టుముట్టి రాళ్లు రువ్వారు. ఈ దాడిలో పలువురు అధికారులు గాయపడ్డారు. ఎన్ఐఏ బృందంపై దాడి ఘటనలో కేసు నమోదైంది. ఈ విషయంలో టీఎంసీ ప్రభుత్వంపై బీజేపీ విరుచుకుపడుతోంది.
మమతా బెనర్జీ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా ఉన్నాయని, పోలీసుల అండదండలతోనే ఇదంతా జరుగుతోందని బీజేపీ ఆరోపించింది. ఈ ఘటనపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. ‘అర్ధరాత్రి ఎన్ఐఏ ఎందుకు దాడులు చేసింది ? పోలీసుల అనుమతి ఉందా.. ? అని ప్రశ్నించారు. బీజేపీ నేత రాహుల్ సిన్హా మాట్లాడుతూ.. సీఎం ఆరోపణలు చేస్తూ.. దాడి చేసిన వారికి మద్దతుగా నిలుస్తోందని ఆరోపించారు.