దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ డీప్ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల కేంద్రమంత్రి అమిత్ షా సహా పలువురి నకిలీ వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
లోక్సభ ఎన్నికలు జరుగుతున్నందున ఈ డీప్ఫేక్ వీడియోల వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ.. సామాజిక మాధ్యమ వేదికలకు గ్రీవెన్స్ అధికారులు ఉన్నారని, పిటిషనర్లు వారిని సంప్రదించారా? అని ప్రశ్నించింది.
దీనికి పిటిషనర్ తరఫు న్యాయవాది బదులిస్తూ.. ”మేం చేయగలినదంతా చేశాం. గ్రీవెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తే రెస్పాన్స్ సమయం 24 నుంచి 48 గంటల మధ్య ఉంది. వారు చర్యలు తీసుకుని, ఆ వీడియోలను తొలగించేలోగా జరగాల్సిన నష్టం జరుగుతుంది” అని కోర్టుకు తెలిపారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామన్న ధర్మాసనం.. పిటిషన్పై గురువారం విచారణ జరుపుతామని వెల్లడించింది.