తెలంగాణలో కొంతమంది పోలీస్ సిబ్బంది వినరాని భాషలో సాధారణ పౌరుడిని దుర్భాషలాడటంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర డిజిపిని ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ ఆలయం సమీపంలో ట్రాఫిక్ పోలీసులు ఓ వాహనదారుడిపై చేయిచేసుకుని, దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ.. ఇది పోలీస్ శాఖకు, డీజీపీకి అంగీకారయోగ్యమైన భాషనా అని ప్రశ్నించారు. పోలీసులు, ప్రభుత్వ అధికారులకు ప్రజలే జీతాలు చెల్లిస్తున్నారని గుర్తుంచుకోవాలని సూచించారు.
ఈ మధ్యకాలంలో ప్రజలతో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు అనేకసార్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పదుల సంఖ్యలో సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నా పోలీసులు స్పందించడం లేదని చెప్పారు. ప్రజలతో వ్యవహరించే విషయంలో పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని సూచించారు.