ఢిల్లీ లిక్కర్ కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని మే 20 వరకు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఈడీ కేసులో రిమాండ్ ముగియడంతో కవితను మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా తిహాడ్ జైలు నుంచి హాజరు పర్చారు. దర్యాప్తు కొనసాగుతున్నందున రిమాండ్ పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. దర్యాప్తు సంస్థ విజ్ఞప్తి మేరకు కస్టడీని ఈనెల 20వరకు పొడిగించింది. ఎనిమిది వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసినట్లు ఈడీ.. కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈనెల 20న విచారణ చేస్తామని న్యాయస్థానం తెలిపింది.