వేసవి సెలవుల కోసం పెద్దమ్మ ఇంటికి వచ్చిన బాలికను రూ.35,000 అప్పు తీర్చడానికి ఇంటికి వచ్చిన బాలికను ఆమె పెద్దమ్మ అమ్మేసింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి షాక్ అయ్యింది. తన కుమార్తెను విడిపించేందుకు అధికారులు, పోలీసులను ఆశ్రయించింది. దీంతో కొన్న వ్యక్తి నుంచి ఆ బాలికను కాపాడారు. కర్ణాటకలోని తుమకూరుకు చెందిన 11 ఏళ్ల బాలిక నాలుగో తరగతి చదువుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్లోని హిందూపురంలో ఉన్న పెద్దమ్మ సుజాత ఇంటికి వెళ్లింది. కూతురు వరుసైన ఆ బాలికను బాగా చూసుకుంటానని సోదరి చౌడమ్మకు ఆమె చెప్పింది.
భూస్వామి శ్రీరాములు నుంచి సుజాత రూ.35,000 అప్పు తీసుకుంది. దీనిని తీర్చేందుకు కూతురు వరుసైన ఆ బాలికను అతడికి అమ్మేసింది. బాలికను నిర్బంధించిన శ్రీరాముడు బాతులను మేపే పనులు చేయిస్తున్నాడు. మరోవైపు బాలిక తల్లి చౌడమ్మ జూన్లో తన సోదరి సుజాత ఇంటికి వెళ్లింది. తన కుమార్తె శ్రీరాములు వద్ద పనులు చేయడం చూసి ఆమె షాక్ అయ్యింది. తన కూతురును విడిచిపెట్టాలని అతడిని ప్రాథేయపడింది. అయితే తన అప్పు చెల్లిస్తేనే బాలికను విడిచిపెడతానని అతడు చెప్పాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు హిందూపురం చేరుకుని బాలికను కాపాడారు. తుమకూరుకు తరలించి ఆమె తల్లికి అప్పగించారు. శ్రీరాములు, సుజాత, ఆమె భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.