Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్ఒకేసారి 1.20 లక్షల మంది యాత్రికులకు అన్న‌ప్ర‌సాదం

ఒకేసారి 1.20 లక్షల మంది యాత్రికులకు అన్న‌ప్ర‌సాదం

Date:

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక వైపున ఔటర్ రింగ్ రోడ్డు ప్రక్కన అధునాతనమైన వంటశాల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. తిరుమలలో కేంద్రీకృత వంటశాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సుమారు రూ.13.45 కోట్ల వ్యయంతో రూపొందించిన వంటశాల 37,245 చ. అడుగుల విస్తీర్ణంలో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేశారు. వంట, ఆహార ధాన్యాలు, కూరగాయలు, పాలు గ్రౌండ్ ఫ్లోర్‌లో, మొదటి అంతస్తులో ఆహారం తయారీ, ఆవిరి ఆధారిత వంట, ఎల్పీజీ ద్వారా నడిచే బాయిలర్లు, ఒక ఎగ్జాస్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఈ అధునాతన వంటశాలలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వారాంతపు సెలవులు, యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కొత్త కేంద్రీకృత వంటశాలలో 1.20 లక్షల మంది యాత్రికులకు అన్నప్రసాదాలు తయారు చెయ్యడానికి అవకాశం ఉంది.

సుమారు 1.20 లక్షల మంది భక్తులకు పులిహోర, సాంబర్, రైస్, పొగల్, ఉప్మా సిద్ధం చేసి సీఆర్ఓ వద్ద ఇప్పటికే ఏర్పాటు చేసిన కౌంటర్లలో అందించడానికి ప్రణాళిక రూపొందించారు. ఈ అన్నప్రసాదాలను సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్, పీఎసీ I, రామ్ బాగీచా విశ్రాంతి భవనం వద్ద వున్న బస్ స్టాండ్, ఔటర్ క్యూ లైన్ల వెంట ఫుడ్ కౌంటర్లలో పంపిణీ చేస్తారు. అత్యాధునిక వంటశాల ఏర్పాటు చేసిన తరువాత భక్తుల రద్దీ ఎంత ఎక్కువ అయినా ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదాలు అందించడానికి అవకాశం ఉంటుందని టీటీడీ అధికారులు అంటున్నారు.