Thursday, September 19, 2024
Homeఅంతర్జాతీయంఅనుమానాస్పద స్థితిలో భారతీయ కుటుంబం మృతి

అనుమానాస్పద స్థితిలో భారతీయ కుటుంబం మృతి

Date:

అమెరికాలోని భారతీయ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాలిఫోర్నియాలో అలమెడ లాస్‌ పులగాస్‌ అనే ప్రాంతంలోని బ్లాక్‌ నంబర్‌ 4100లో ఈ ఘటన చోటు చేసుకొంది. కేరళకు చెందిన ఆనంద్‌ సుజాత్‌ హెన్రీ (42), భార్య అలిస్‌ బెంజిగర్‌ (40), నాలుగేళ్ల వయసున్న ఇద్దరు పిల్లల మృతదేహాలను గుర్తించారు. కుటుంబ కలహాలే ఈ మరణాలకు కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. వెల్ఫేర్‌ చెక్‌ సమయంలో ఈ ఇంటి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఆ ఇంటిలోకి వెళ్లే అన్ని తలుపులు మూసే ఉన్నాయి. కానీ, ఒక కిటికీ తెరిచి ఉండటంతో అధికారులు అందులో నుంచి లోపలకు ప్రవేశించారు. వారికి బాత్‌రూమ్‌లో దంపతుల మృతదేహాలు కనిపించాయి. వీరి శరీరంపై తుపాకీతో కాల్చిన గాయాలున్నాయి. సమీపంలో ఒక 9ఎంఎం తుపాకీ, తూటాలను స్వాధీనం చేసుకొన్నారు.

ఇంటి పడకగదిలో ఇద్దరు బాలుర మృతదేహాలు కనిపించాయి. వారి శరీరాలపై ఎటువంటి గాయాలు లేవు. దీంతో ఆ చిన్నారులపై విషప్రయోగం వంటివి చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కోర్టు రికార్డుల ప్రకారం ఆనంద్‌ సుజాత్‌ 2016లో విడాకుల కోసం పిటిషన్‌ దాఖలు చేశాడు. కానీ, ప్రొసీడింగ్స్‌ పూర్తికాలేదు. గతంలో ఇదే ఇంటి నుంచి పోలీసులకు ఫోన్‌కాల్‌ వెళ్లింది. దానికి కారణం ఏమిటో మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో వీరి మరణాలకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆనంద్‌ సుజాత్‌ హెన్రీ తొమ్మిదేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నాడు. మెటా, గూగుల్‌ వంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పనిచేశాడు. మెటాలో రాజీనామా చేశాక.. లాగిట్స్‌ అనే కృత్రిమ మేధ కంపెనీని సొంతంగా ప్రారంభించాడు. కొన్నాళ్ల క్రితమే ఇతడు 2.1 మిలియన్‌ డాలర్ల విలువైన ఇంటిని కొనుగోలు చేశాడు.