Sunday, September 22, 2024
HomeUncategorizedఅసెంబ్లీ నుంచి బస్సుల్లో మేడిగడ్డకు

అసెంబ్లీ నుంచి బస్సుల్లో మేడిగడ్డకు

Date:

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళవారం మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని సందర్శించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగానే.. 10.15 వరకు సభలో పాల్గొంటారు. అనంతరం అసెంబ్లీ నుంచి బస్సుల్లో నేరుగా మేడిగడ్డకు బయలుదేరి మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడికి చేరుకుంటారు. రెండు గంటలపాటు సైట్‌ విజిట్‌, పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ (పీపీటీ) ఉంటుంది. కార్యక్రమం పూర్తయ్యాక సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.

నిర్మాణ లోపాలు ఎత్తి చూపేందుకు మేడిగడ్డ బ్యారేజీని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ ప్రభుత్వ ఖర్చుతో తీసుకెళ్తామని శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం 40 బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో బ్యారేజీ దెబ్బతిన్న ప్రాంతానికి చేరుకొనే విధంగా అధికారులు చదును పనులు పూర్తి చేయించారు. వ్యూపాయింట్ ప్రాంగణం వద్ద 3 వేల మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే నిర్మాణ లోపాలపై పీపీటీ, సభ నిర్వహించే అవకాశం ఉంది. భద్రతపరంగా ఆయా మార్గాల్లో పోలీసు అధికారులు ప్రయాణించి పరిశీలించారు. రహదారులు, కల్వర్టులను బాంబు స్క్వాడ్ తనిఖీ చేస్తోంది.