తమిళనాడు రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభకు వచ్చిన గవర్నర్ ఆర్.ఎన్. రవి ప్రారంభ ప్రసంగం చేసేందుకు నిరాకరించారు. జాతీయ గీతాన్ని ప్రభుత్వం గౌరవించలేదని ఆరోపిస్తూ.. నిమిషాల వ్యవధిలోనే సభ నుంచి వెళ్లిపోయారు. గవర్నర్ ప్రసంగానికి ముందు, తర్వాత జాతీయ గీతం ఆలపించాలని నేను పదే పదే చేసిన అభ్యర్థనలను విస్మరించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో చెప్పిన చాలా అంశాలను నైతిక కారణాలతో నేను అంగీకరించలేదు. వాటి విషయంలో విభేదించే నేను.. ప్రసంగంలో వాటిని పేర్కొంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. అందుకే ఈ ప్రసంగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను” అంటూ గవర్నర్ సభను వీడారు.
గతేడాది కూడా ప్రసంగం విషయంలో గవర్నర్ ఇలాగే వ్యవహరించారు. బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వం సిద్ధం చేసి ఆమోదం పొందిన ప్రసంగంలోని కొన్ని భాగాలు మినహాయించి, కొన్ని వాక్యాలు అదనంగా చేర్చి గవర్నర్ ప్రసంగించడం తీవ్ర దుమారం రేపింది. గవర్నర్ సొంతంగా చేర్చిన వ్యాఖ్యలను సభా రికార్డులో చేర్చకూడదని, ప్రభుత్వం సిద్ధం చేసిన గవర్నర్ ప్రసంగాన్ని మాత్రమే యథాతథంగా రికార్డులో నమోదు చేయాలంటూ స్టాలిన్ తీసుకొచ్చిన తీర్మానం ఆమోదం పొందింది. ఈ వ్యవహారం గవర్నర్, స్టాలిన్ సర్కార్ మధ్య విభేదాలకు మరింత ఆజ్యం పోసింది. తాజాగా మరోసారి ఆయన ప్రసంగించేందుకు నిరాకరించడం తీవ్ర చర్చనీయాంశమైంది.