రోగుల సమస్యలను తెలుసుకుంటూ, వైద్యరంగంలో రాణించాల్సిన కొంతమంది వైద్య విద్యార్థులు చేసిన పనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం గదగ్లోని ప్రభుత్వ జిమ్స్ ఆస్పత్రిలో రీల్స్ చేసిన 38 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను సస్పెండ్ చేశారు. వీరందరూ జిల్లా ఆస్పత్రి కారిడార్లో కన్నడ సినిమా పాటకు నృత్యం చేసిన వీడియో వైరల్ అయింది.
ఆస్పత్రి విధుల సమయంలో రోగులకు చికిత్స చేయకుండా వీడియోలు తీసుకుంటూ హల్చల్ చేశారని ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. వీడియోలు తీసుకోవడానికి ఆసుపత్రి తప్ప మరో జాగా లేదా అంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. దీంతో జిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బసవరాజ బొమ్మనహళ్లి వారిని 10 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఆస్పత్రిలో ఇలాంటి పనులు చేయడం చాలా తప్పు అని తెలిపారు.