Sunday, September 22, 2024
HomeUncategorizedలాఠీలకు నూనె రాసి పూజ చేసిన క్రాంతి సేన

లాఠీలకు నూనె రాసి పూజ చేసిన క్రాంతి సేన

Date:

ప్రేమికుల రోజును ప్రేమికులు చాలా గొప్పగా జరుపుకునేందుకు వివిధ రకాల ప్లాన్స్ వేసుకుంటారు. కాని ఉత్తరప్రదేశ్‌లోని కాంత్రి సేన మాత్రం ‘లాఠీ పూజ’ ని నిర్వహించింది. లాఠీలకు నూనె రాసి పూజ చేస్తున్న వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రేమికులు దినోత్సవం ముసుగులో అమ్మాయిలపై దురుసుగా ప్రవర్తించే, ఆటపట్టించే వ్యక్తులకు, లవ్ జిహాద్ వ్యాప్తి చేసే వ్యక్తులకు లాఠీలతో గుణపాఠం చెబుతామని క్రాంతి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోజ్ సైనీ హెచ్చరించారు.

క్రాంతిసేన ఆధ్వర్యంలో ముజఫర్ నగర్‌లో లాఠీలకు పూజను నిర్వహించినట్లు సైనీ తెలిపారు. రెస్టారెంట్ నిర్వాహకులు అసభ్యకరమైన కార్యక్రమాలు నిర్వహించొద్దని క్రాంతి సేన విజ్ఞప్తి చేసింది. ప్రేమికుల దినోత్సవం ముసుగులో అమ్మాయిలను వేధించే వారిందరికి హెచ్చరిస్తున్నామని చెప్పారు. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే తమదైన రీతిలో సరిదిద్దుతామని వార్నింగ్ ఇచ్చారు. వాలెంటైన్స్ డే ముసుగులో చాలా మంది లవ్ జిహాద్‌ని ప్రోత్సహిస్తున్నట్లు క్రాంతి సేన ఆరోపించింది.

రాష్ట్రంలో ప్రతీ చోట మా కార్యకర్తల నిఘా ఉంటుందని క్రాంతిసేన తెలిపింది. ఇలాంటి వారు ఎక్కడ దొరికినా గుణపాఠం చెబుతామన్నారు. ఫిబ్రవరి 14న వసంత పంచమి పండగ కూడా వస్తోందని క్రాంతి సేన మహిళా జిల్లా అధ్యక్షురాలు పూనమ్ చౌదరి తెలిపారు. పాశ్చాత్య సంస్కృతిని అవలంబించవద్దని, ప్రేమికుల రోజు వంటి వాటికి దూరంగా ఉండాలని, అది భారతీయ సంస్కృతిలో భాగం కాదని అందుకే మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున ఏదైనా రెస్టారెంట్, హోటల్ లేదా సినిమా హాలులో ఎవరైనా ప్రేమ జంట కలిసి కూర్చున్నట్లు కనిపిస్తే, వారికి కర్రలతో వడ్డిస్తామని మహిళలందరూ ప్రతిజ్ఞ చేసారు.