Saturday, September 21, 2024
HomeUncategorizedకరోనా వైరస్ 223 సార్లు పరివర్తన చెందింది

కరోనా వైరస్ 223 సార్లు పరివర్తన చెందింది

Date:

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ 223 సార్లు పరివర్తన చెందిందని, ఇన్‌ఫ్లుఎంజా మాదిరిగా కరోనా కొనసాగుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. దాని వేరియంట్స్ ఇప్పుడు ప్రాణాంతకం కాదని అన్నారు. శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కరోనా గురించి మన్సుఖ్ మాండవియా మాట్లాడారు. ‘ఒక వైరస్ వంద సార్లు మ్యుటేషన్ చెందినప్పుడు దాని హానికరమైన ప్రభావాలు తగ్గుతాయి. కోవిడ్ కూడా పరివర్తన చెందింది. ఇప్పటివరకు కరోనా వైరస్ 223 సార్లు పరివర్తన చెందింది’ అని తెలిపారు. ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు ప్రజలకు వచ్చే ఇన్‌ఫ్లుఎంజా మాదిరిగా కరోనా మనతో ఉంటుందని, ఆ వైరస్‌ అలాగే కొనసాగుతుందని చెప్పారు. కరోనా సబ్‌ వేరియంట్స్‌ అంత ప్రాణాంతకం కాదని, వాటి వల్ల ప్రతికూల ప్రభావాలు లేవని అన్నారు.

ఆరోగ్య సమస్యపై అన్ని దేశాలు, అన్ని వర్గాలు ఏకతాటిపైకి వచ్చి పనిచేయాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాలన్నీ కలిసి పనిచేయడంతో సానుకూల ఫలితాలను చూశామన్నారు. భారత్‌లో పటిష్టమైన ఔషధ ఉత్పత్తి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ప్రపంచం దానిని గుర్తించిందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో 70 శాతం హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ మందులను ఉత్పత్తి చేస్తున్నామని, అలాగే ప్రపంచం మంచిదని భావించే అనేక మెడిసిన్స్‌ను భారత్‌ ఉత్పత్తి చేస్తోందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్‌ స్కీమ్‌ గురించి ఆయన వివరించారు.