దేశం ప్రతి రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘ది ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్’లో ప్రారంభోపన్యాసం చేశారు. ప్రపంచానికి భారత్ ఆశాకిరణంలా కనిపిస్తోందన్నారు.
”మా ప్రభుత్వం ఇప్పటికే 125 రోజులు పూర్తి చేసుకొంది. ఈ కాలంలో మా ప్రభుత్వ అనుభవాన్ని మీతో పంచుకుంటాను. పేదలకు 3 కోట్ల కొత్త పక్కా గృహాలు ఇచ్చాం. రూ.9 లక్షల కోట్ల ఇన్ఫ్రా ప్రాజెక్టులపై పని మొదలైంది. 15 వందేభారత్ రైళ్లు ప్రారంభించాం. 8 కొత్త ఎయిర్ పోర్టుల పనికి శ్రీకారం చుట్టాం. యువతకు రూ.2లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చాం. రైతుల ఖాతాల్లో రూ.21 వేల కోట్లను బదిలీ చేశాం. 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఉచిత వైద్యానికి ఏర్పాట్లు చేశాం. 5 లక్షల ఇళ్లలో రూఫ్టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేశాం. స్టాక్మార్కెట్ సూచీల్లో దాదాపు 7 శాతం వృద్ధి నమోదైంది. విదేశీ మారకద్రవ్యం 700 బిలియన్ డాలర్లను దాటేసింది. నేను కేవలం 125 రోజుల్లో జరిగిందే చెబుతున్నాను. ఈ కాలంలో భారత్లో ప్రపంచం మూడు విషయాలు చర్చించడానికి వచ్చింది. టెలికామ్-డిజిటల్ ఫ్యూచర్పై అంతర్జాతీయ అసెంబ్లీ జరిగింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ నిర్వహించారు. గ్లోబల్ సెమీకండెక్టర్ ఎకోసిస్టమ్పై సదస్సు జరిగింది. ఇవి భారత్ దిశ.. ప్రపంచం ఆశను తెలియజేస్తున్నాయి. ప్రపంచ భవిష్యత్తును భారత్ నిర్ణయిస్తుంది. మా ప్రభుత్వ మూడో విడత పాలనతో రేటింగ్ ఏజెన్సీలు దేశ వృద్ధిరేటును గణనీయంగా పెంచాయి” అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.