తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 31,383 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను అధికారులు మూసివేశారు. ఆలస్యంగా వచ్చినవారిని లోపలికి అనుమతించలేదు. తొలిరోజు జనరల్ ఇంగ్లీష్ పేపర్ పరీక్ష నిర్వహించారు. రేపటి నుంచి ఈనెల 27 వరకు వివిధ సబ్జెక్టుల ప్రకారం పరీక్షలు జరగనున్నాయి.
పరీక్షలను వాయిదా వేయాలంటూ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ విధించారు. దీని ప్రకారం 200 మీటర్ల వరకు ఐదుగురికి మించి ఉండేందుకు వీల్లేదు. ప్రతి కేంద్రం వద్ద ఒక ఎస్సై ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుల్ సహా మొత్తం ఆరుగురు కానిస్టేబుళ్లు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. పరీక్ష గది, చీఫ్ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఈ నెల 21 నుంచి 27 వరకు జరిగే పరీక్షలకు సంబంధించి రోజూ ప్రశ్నపత్రాలు, జవాబుపత్రాలు తరలించే జీపీఎస్ అమర్చిన వాహనాలు నిర్దేశిత మార్గాల్లోనే ప్రయాణించేలా రూట్మ్యాప్ రూపొందించారు.