Saturday, October 5, 2024
Homeజాతీయంగుర్రంపై వ‌చ్చి ఓటు వేసిన ఎంపీ జిందాల్‌

గుర్రంపై వ‌చ్చి ఓటు వేసిన ఎంపీ జిందాల్‌

Date:

హర్యానాకు చెందిన బీజేపీ ఎంపీ నవీన్‌ జిందాల్‌ గుర్రంపై పోలింగ్‌ కేంద్రానికి వ‌చ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కురుక్షేత్ర ఎంపీ అయిన నవీన్‌ జిందాల్‌ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. శుభపరిణామంగా భావించి గుర్రంపై స్వారీ చేస్తూ పోలింగ్‌ బూత్‌కు వచ్చి ఓటు వేసినట్లు తెలిపారు. తన తల్లి సావిత్రి జిందాల్‌ హిసార్‌ నుంచి పోటీ చేస్తున్నదని ఆయన చెప్పారు. హిసార్‌ కోసం చాలా చేయాలని ఆమె కోరుకుంటున్నదని తెలిపారు. అయితే తమ ప్రతినిధిగా ఎవరు ఉండాలో అన్నది హిసార్‌ ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై నవీన్ జిందాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు తమ పార్టీని ఆశీర్వదిస్తారని తెలిపారు. ‘ప్రజల్లో చాలా ఉత్సాహం ఉంది. వారు ఈ రోజు ఓటు వేయడం చాలా సంతోషంగా ఉంది. హర్యానా ప్రజలు ధైర్యవంతులు, అవగాహన ఉన్న వారని నేను విశ్వసిస్తున్నా. బీజేపీకి ఆశీస్సులు అందజేసి ఆశీర్వదిస్తారు. నయాబ్ సింగ్ సైనీ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు’ అని అన్నారు.