Friday, October 4, 2024
Homeక్రైంచిన్న గాయానికే రూ.1.200 బిల్లు వేస్తావా అంటూ వైద్యుడిని చంపిన మైనర్లు

చిన్న గాయానికే రూ.1.200 బిల్లు వేస్తావా అంటూ వైద్యుడిని చంపిన మైనర్లు

Date:

ఓ డాక్టర్ మెడికల్ బిల్లు ఎక్కువ అడిగాడని ఏకంగా డాక్టర్ ప్రాణాలే తీసేశారు ముగ్గురు మైనర్లు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఫరీదాబాద్‌లో ఒక బాలుడు ప్రమాదానికి గురయ్యాడు. సెప్టెంబర్ 20-21 మధ్యరాత్రిలో ఢిల్లీలోని కాళింది కుంజ్ ప్రాంతంలోని నర్సింగ్ హోమ్ అయిన నిమా ఆస్పత్రికి వచ్చాడు. డాక్టర్ జావేద్ అక్తర్.. ట్రీట్‌మెంట్ చేసి రూ.1.200 బిల్లు ఇచ్చాడు. చిన్న దెబ్బకే ఇంత డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారని వైద్యుడితో గొడవకు దిగాడు. ఇది తీవ్ర ఘర్షణకు దారి తీసింది. అనంతరం బాలుడు రూ.400 చెల్లించి ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. 10 రోజుల తర్వాత కట్టు విప్పించుకునేందుకు తిరిగి తన అత్తతో కలిసి ఆస్పత్రికి వచ్చాడు. అయితే ఆస్పత్రి సిబ్బంది మాత్రం చికిత్స చేసేందుకు నిరాకరించారు. అంతేకాకుండా డాక్టర్ జావేద్ అక్తర్ మందలించాడు. దీంతో బాలుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అవమాన భారంగా భావించాడు. బాలుడు.. డాక్టర్ అక్తర్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఇద్దరు స్నేహితుల సహాయం కోరాడు. వారు అందుకు అంగీకరించారు. మొత్తానికి ఒక తుపాకీని సంపాదించుకుని ముగ్గురు ఆస్పత్రికి వచ్చారు. మరోసారి డ్రెస్సింగ్ చేయమని కోరితే.. డాక్టర్ నిరాకరించాడు. దీంతో వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరపడంతో జావేద్ అక్తర్ ప్రాణాలు కోల్పోయాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్ అవమానించడంతోనే వైద్యుడిని చంపినట్లు మైనర్ నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. డ్రెస్సింగ్ చేయమని అడిగితే చేయలేదని.. అంతేకాకుండా తనతో గొడవకు దిగడంతోనే డాక్టర్‌ను చంపాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇద్దరు స్నేహితుల సహాయంతో ఈ పని చేసినట్లు తెలిపాడు.