Tuesday, September 24, 2024
Homeజాతీయంవిడాకుల సంస్కృతి పెర‌గడానికి ఇవే కార‌ణం

విడాకుల సంస్కృతి పెర‌గడానికి ఇవే కార‌ణం

Date:

నేటి యువ‌తీ, యువ‌కులు చిన్న‌, చిన్న స‌మ‌స్య‌ల‌ను పెద్దవిగా చూడ‌టం వ‌ల‌న‌నే బంధాల దూర‌మ‌వుతూ విడాకుల సంఖ్య పెరుగుతుంద‌ని ప్ర‌ముఖ గాయ‌ని ఆశా భోంస్లే ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆధ్యాత్మికవేత్త రవిశంకర్‌తో ఆమె ఓ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడాకుల అంశాన్ని ప్రస్తావిస్తూ.. యువతీయువకులు ఒకరిపై ఒకరు త్వరగా విసుగు చెందుతున్నారన్నారు. ‘నా భర్తపై నాకు కోపం వచ్చినప్పుడు మా అమ్మ దగ్గరకు వెళ్లి కొన్ని రోజులు అక్కడే ఉండి వచ్చేదాన్ని. అంతేకానీ, విడాకులు ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఈ రోజుల్లో ప్రతినెలా విడాకులు తీసుకొనేవారి సంఖ్య పెరుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది?’ అని ఆమె రవిశంకర్‌ను ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానం చెబుతూ.. ‘మీరు పాటలతో అందరినీ సంతోషపరుస్తారు. మీకు దేవుడిపై నమ్మకం ఉంది.. అలాగే కష్టాలను తట్టుకునే శక్తి కూడా ఉంది. నేటితరానికి సహనం తగ్గిపోయింది’ అని అన్నారు.

‘నేను చిత్ర పరిశ్రమలో చాలా సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను. నా కెరీర్‌లో ఎంతోమందిని చూశాను. ప్రస్తుత తరంతో పోలిస్తే గతంలో వారు ఎప్పుడూ ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోలేదు. యువతీయువకుల మధ్య ప్రేమ చాలా తర్వగా ముగుస్తోంది. ఒకరిపై ఒకరు త్వరగా విసుగు చెందుతున్నారు. విడాకుల సంఖ్య పెరగడానికి ఇదే ప్రధాన కారణం’ అని ఆశా భోంస్లే అన్నారు. ఇక ఇదే సందర్భంగా మహిళలు పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపకపోవడంపై కూడా ఆశా భోంస్లే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ రోజుల్లో స్త్రీలు సంతానాన్ని ఓ భారంగా భావిస్తున్నారన్నారని, అన్ని వర్గాల మహిళలు ఇదే ధోరణితో ఉన్నారన్నారు. ‘ఈ రోజుల్లో స్త్రీలు సంతానాన్ని భారంగా భావిస్తున్నారు. నేను 10 సంవత్సరాల వయసులో ప్లేబ్యాక్‌ సింగర్‌గా కెరీర్‌ ప్రారంభించాను. ఆ తర్వాత నేను నా కెరీర్‌తోపాటు ముగ్గురు పిల్లల్ని పెంచి పెద్ద చేశాను. వారికి వివాహం చేశాను. ఇప్పుడు నాకు మనవరాళ్లు కూడా ఉన్నారు. నా భర్త లేకుండా నేను అన్ని బాధ్యతలను విజయవంతంగా, ఒంటరిగా నిర్వర్తించాను. నా పిల్లల చదువుల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఎంతో సహనంతో వ్యవహరించా. నా బిజీ వృత్తిలో రాత్రి పగలూ పని చేస్తూనే ఈ బాధ్యతలను నిర్వర్తించా’ అని ఆశా భోంస్లే వివరించారు.