కృత్రిమ మేధ (ఏఐ)లో 2025 కల్లా భారత్లో 20 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో, ఛైర్మన్ సత్య నాదెళ్ల తెలిపారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ముంబయికి చేరుకున్న ఆయన.. ఏఐ కోసం డేటాసెట్స్ రూపొందించే సంస్థ సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏఐ విషయంలో భారత్-అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏఐ శక్తివంతమైన కొత్త సాంకేతికత. దాని గురించి ఆందోళన చెందకుండా.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరింపచేయాలి. ఇందుకు అనుసరించాల్సిన విధి విధానాలు రూపొందించడంలో భారత్ – అమెరికాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ భాగస్వామ్యం ఇరుదేశాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. 2025 నాటికి ఈ రంగంలో భారత్లో 20 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇస్తాం. దేశ జీడీపీ పెరగడానికి ఏఐ దోహదపడుతుంది. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ ఒకటి” అని సత్య నాదెళ్ల తెలిపారు.
ఇటీవలే మైక్రోసాఫ్ట్ కంపెనీ కీలక మైలురాయిని దాటింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ మూడు ట్రిలియన్ డాలర్లు దాటిన రెండో కంపెనీగా అవతరించింది. గత కొంతకాలంగా ఓపెన్ ఏఐతో కలిసి మైక్రోసాఫ్ట్ ఏఐపై పరిశోధనలు చేస్తోంది. ఇందులోభాగంగా కొత్త టూల్స్ను ఆవిష్కరిస్తోంది. మరోవైపు ఫిబ్రవరి 4కి సత్య నాదెళ్ల కంపెనీ సీఈవో బాధ్యతలు చేపట్టి పదేళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆయన సంస్థ ఛైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు.