Saturday, September 21, 2024
HomeUncategorizedకుటుంబ సభ్యుల కోసం బడా నేతల క్యూ

కుటుంబ సభ్యుల కోసం బడా నేతల క్యూ

Date:

దేశంలో సార్వత్రిక ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీట్ల కోసం భారీగా డిమాండ్ నెలకొంది. పెద్ద లీడర్లు సైతం తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ్ముడి కోసం అన్న, భార్య కోసం భర్త, కూతురు కోసం తండ్రి టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండడం, కాంగ్రెస్ పార్టీకి ఊపు ఉండడంతో హస్తం పార్టీ నుంచి టికెట్ ఇప్పించుకోవాలని బడా నేతలు సైతం పావులు కదుపుతున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడే తమ కుటుంబ సభ్యులను రాజకీయంగా సెట్ చేయాలని కసరత్తు చేస్తున్నారు. ఖమ్మం ఎంపీ టిక్కెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం నుంచి భారీ ర్యాలీగా వచ్చి దరఖాస్తు చేసిన నందిని.. తనకే టిక్కెట్ వస్తుందని ధీమాగా ఉన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి కూడా ఖమ్మం ఎంపీ టిక్కెట్ కోసం దరఖాస్తు చేశారు. ఇద్దరు మంత్రులు తమ కుటుంబ సభ్యుల కోసం ఒకే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టికెట్ కోసం పోటీ పడుతుండడం ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి నల్గొండ ఎంపీ టిక్కెట్ కోసం దరఖాస్తు చేశారు. జానారెడ్డి రెండో కొడుకు జైవీర్ నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉండగా.. ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం ఇంకో కొడుకు రఘువీర్ దరఖాస్తు చేసుకున్నారు. ఇదే టిక్కెట్ కోసం మంత్రి కోమటిరెడ్డి ఫ్యామిలీ కూడా ప్రయత్నిస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరు మంత్రిగా, మరొకరు ఎమ్మేల్యేగా ఉండగా తమ కుటుంబానికి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి నల్గొండ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. మరోవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూతురు సైతం నల్గొండ టికెట్ ఆశిస్తున్నట్లు వినిపిస్తోంది. తమ కుటుంబంలో ఎవరికి టికెట్ ఇచ్చినా తమకు ఒకే అని కోమటిరెడ్డి ఫ్యామిలీ భావిస్తోంది. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కూతురు కీర్తి రెడ్డి భువనగిరి ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. టికెట్ కోసం గాంధీ భవన్‌లో దరఖాస్తు చేసుకున్న కీర్తి రెడ్డి టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్నారు.

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తన తండ్రికి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి టిక్కెట్ కోసం మైనంపల్లి హాన్మంతరావు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. ఇక నాగర్ కర్నూలు ఎంపీ టిక్కెట్ కోసం మల్లు రవి దరఖాస్తు చేసుకున్నాడు. మల్లు బ్రదర్స్ లో భట్టి విక్రమార్క డిప్యూటీ సీఏం గా ఉండగా, భట్టి సోదరుడు మల్లు రవి నాగర్ కర్నూల్ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న మల్లు రవి టికెట్ కోసం అవసరమైతే తన పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్దంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరో మంత్రి దామోదర రాజనర్సింహ కూతురు సైతం ఎంపీ టికెట్ కోసం ఆశిస్తున్నారు. జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని దామోదర కూతురు త్రిష భావిస్తున్నారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఒకరిద్దరు నేతలు సైతం తమ కుటుంబ సభ్యులకు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అంజన్ కుమార్.. తన కొడుకు అనిల్ కుమార్ టికెట్ కోసం కాంగ్రెస్ పెద్దలను అడిగినట్లు తెలుస్తోంది. ఇక తనకి లేదా తన కుటుంబ సభ్యులలో ఒకరికి టికెట్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధిష్ఠానాన్ని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ సైతం తనకి నాగర్ కర్నూల్ టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. టికెట్ల కోసం అధిష్ఠానంపై భారీ ఒత్తిడి ఉన్నప్పటికీ గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక ఈ ప్రయత్నంలో ఏ ఫ్యామిలీ సక్సెస్ అవుతుందో చూడాలి.