Friday, September 20, 2024
HomeUncategorizedభారత కుబేరుల జాబితాలో అదానీ అగ్రస్థానం

భారత కుబేరుల జాబితాలో అదానీ అగ్రస్థానం

Date:

అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ భారత అపర కుబేరుల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీని దాటేసి తొలి స్థానం దక్కించుకున్నారు. ఈమేరకు హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ను వెలువరించింది. గత ఐదేళ్లుగా దేశంలో బిలియనీర్లు పెరుగుతున్నారని నివేదిక పేర్కొంది. దేశంలో మొత్తం 334 మంది బిలియనీర్లు ఉన్నారని, ఏడాదిలో 29 శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది. అదే సమయంలో చైనాలో వీరి సంఖ్య 25 శాతం మేర తగ్గిందని పేర్కొంది. జులై 31 నాటి గణాంకాలను ఆధారంగా చేసుకొని ఈ నివేదికను రూపొందించింది.

హురూన్‌ ఇండియా వెలువరించిన జాబితాలో రూ.11.61 లక్షల కోట్ల సంపదతో అదానీ అగ్రస్థానంలో నిలిచారు. గత ఏడాదిలో ఆయన సంపద ఏకంగా 95 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. రూ.10.14 లక్షల కోట్లతో అంబానీ రెండో స్థానంలో నిలిచారు. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అధినేత శివ్‌నాడార్‌, ఆయన కుటుంబం రూ.3.14 లక్షల కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధినేత సైరస్‌ పూనావాలా, సన్‌ఫార్మా అధినేత దిలీప్‌ సంఘ్వీ నాలుగైదు స్థానాలు దక్కించుకున్నారు. కుమార మంగళం బిర్లా, గోపీచంద్‌ హిందుజా, రాధాకృష్ణ దమానీ, అజీమ్‌ ప్రేమ్‌జీ, నీరజ్‌ బజాజ్‌ టాప్‌-10 జాబితాలో నిలిచారు.