Friday, September 20, 2024
HomeUncategorizedస‌బ్‌స్రిప్ష‌న్ ధ‌ర‌ల‌ను పెంచిన యూట్యూబ్‌

స‌బ్‌స్రిప్ష‌న్ ధ‌ర‌ల‌ను పెంచిన యూట్యూబ్‌

Date:

భార‌త్‌లో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ వేదిక యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచింది. ప్రకటనలు లేకుండా కంటెంట్‌ వీక్షించేందుకు తీసుకొచ్చిన ఈ సదుపాయం పొందాలంటే ఇకపై ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సిందే. ఫ్యామిలీ, స్టూడెంట్‌, వ్యక్తిగత ప్లాన్‌ అన్నింటి ధరల్ని సవరించింది. కొత్త ధరలు కంపెనీ వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. యూట్యూబ్‌ వ్యక్తిగత ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ధర నెలకు రూ.149గా నిర్ణయించింది. ఇంతకు ముందు ఈ ధర రూ.129గా ఉండేది. గతంలో రూ.189గా ఉన్న ఫ్యామిలీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ధరను ప్రస్తుతం రూ.299కి పెంచింది. ఫ్యామిలీ ప్లాన్‌ తీసుకుంటే కుటుంబంలోని ఐదుగురు ప్రీమియం ప్రయోజనాలు పొందొచ్చు. ఇక ప్రీమియం స్టూడెంట్‌ ప్లాన్‌ ధర రూ.79 నుంచి రూ.89కి పెంచింది. ప్రీపెయిడ్‌తోపాటు రెన్యువల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధరల్ని వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ సవరించింది.

వ్యక్తిగత ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ధర నెలకు రూ.159కి సవరించింది. గతంలో ఈ ధర కేవలం రూ.139గా ఉండేది. ఇక వ్యక్తిగత త్రైమాసిక ప్లాన్‌ ధరను రూ.399 నుంచి రూ.459కి సవరించింది. ఇక వార్షిక ప్లాన్‌ను రూ.1290 నుంచి రూ.1490కి పెంచేసింది. అంటే ఏకంగా రూ.200 అధికం. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకొనేందుకు యూట్యూబ్‌ 30 సెకండ్ల పాటు అన్‌స్కిప్పబుల్‌ యాడ్స్‌ని చాలాకాలం క్రితమే తీసుకొచ్చింది. యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రైబర్లను పెంచుకోవటంలో భాగంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా వాటి ధరల్ని పెంచింది.