Saturday, September 21, 2024
HomeUncategorizedకేజీ జిలేబీ తెస్తేనే కేసు నమోదు చేస్తాం

కేజీ జిలేబీ తెస్తేనే కేసు నమోదు చేస్తాం

Date:

ప్రజలు ఏదైనా సమస్య వస్తే ఫిర్యాదు చేసేందుకు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌ వెళ్లి ఫిర్యాదు చేస్తారు.  ఫిర్యాదు చేస్తే, కేసు పరిష్కారానికి కొంతమంది పోలీసులు లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తారు. యూపీలోని బహదూర్‌గఢ్ పోలీసులు మాత్రం చాలా వెరైటీ కోరిక కోరారు. బాధితుడి ఫిర్యాదును నమోదు చేసుకోవాలంటే ముందు కేజీ జిలేబీ లేదా బలుషాహి (ఉత్తరభారతం స్వీట్) తీసుకురావాలని ఆదేశించారు.

విలువైన వస్తువు కనపడకపోతే ఎవరైనా వెతకడం సహజం. అప్పటికీ దొరక్కపోతే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తాం. యూపీలోని కనౌర్ గ్రామానికి చెందిన చంచల్ కుమార్ అనే యువకుడు అదే చేశాడు. గత శనివారం మందులు కొనుగోలు చేయడానికి మెడికల్ షాప్‌కు వెళ్లాడు. బిల్లు ఫోన్‌పే చేయడానికి మొబైల్ కోసం జేబులో చెయ్యి పెట్టాడు. అయితే ఫోన్ కనబడలేదు. దారిలో పడిపోయిందేమోనని వచ్చిన దారిలో వెతుక్కుంటూ ఇంటికి చేరాడు. ఇంట్లో వెతికినా ఫోన్ దొరకలేదు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేశాడు. ఎలాగైనా ఫోన్‌ను కనిపెట్టాలని పోలీసులను కోరాడు.

*కిలో స్వీట్స్ తెస్తేనే కేసు నమోదు*

స్టేషన్‌లో పోలీసుల ప్రవర్తన చూసి చంచల్ కుమార్ షాక్ అయ్యాడు. ఫిర్యాదును పరిష్కరించాల్సిన పోలీసుల చిల్లర ప్రవర్తన అతనికి చికాకు తెప్పించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలంటే కేజీ జిలేబీ తీసుకురావాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపు ఆలోచించి, తనకు ఫోన్ దొరకడం ముఖ్యమని అనుకుని పోలీసులు చెప్పినట్లు కేజీ జిలేబీ తీసుకొచ్చాడు. తర్వాత ఈ విషయం బయటకు రావడంతో అధికారులు ఫైర్ అవుతున్నారు. ఫిర్యాదు రిజిస్టర్ చేయకుండా, బాధితునితో జిలేబీ తెప్పించుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.