Saturday, September 21, 2024
HomeUncategorizedవందేళ్లు దాటిన వృద్ద ఓటర్లు పదివేల మంది

వందేళ్లు దాటిన వృద్ద ఓటర్లు పదివేల మంది

Date:

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఈసారి ఓటు వేయబోయే ఓటర్లలో 10 వేలకు పైగా వందేళ్లు దాటిన వృద్ధులు ఉన్నారు. దీంతో ఈసీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. హర్యానాలో 100 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య ఆ రాష్ట్రానికి పొరుగునే ఉన్న పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌ల కంటే ఎక్కువగా ఉన్నట్లు ఈసీ గుర్తించింది. దీంతో ఎన్నికల అధికారులు ఇప్పుడు బూత్ స్థాయిలో డేటాను నిర్ధారించేందుకు అధికారులను పంపుతున్నారు. హర్యానాలో అక్టోబర్ 1న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో రాష్ట్రంలోని 9,554 మంది ఓటర్లు 100 ఏళ్లు పైబడిన వారని హర్యానా ముఖ్య ఎన్నిక అధికారి పంకజ్ అగర్వాల్ తెలిపారు.

దీంతో అనుమానం వచ్చి పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లో ఆరా తీశారు. ఇందులో పంజాబ్‌లో 4,116 మంది వందేళ్లు పైబడిన ఓటర్లు ఉన్నారని, హిమాచల్ ప్రదేశ్‌లో 1,216 మంది ఉన్నారని తేలింది. దీంతో ఈసీ సందేహాలు వ్యక్తం చేస్తూ తదుపరి విచారణకు ఆదేశించింది. శతాధిక వృద్ధుల డేటాను తిరిగి నిర్ధారించాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ సంఖ్య అసాధారణంగా ఉన్నట్లు తేల్చారు. వీరి సంఖ్యపై ఈసీ సంతృప్తి చెందలేదని, అందువల్ల బూత్ స్థాయి అధికారుల సహాయంతో ధృవీకరణ చేయాల్సి ఉందన్నారు.