Saturday, September 21, 2024
HomeUncategorizedకోల్‌కతా కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు

కోల్‌కతా కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు

Date:

పశ్చిమబెంగాల్ కోల్‌కతా ఆర్జీ కార్ దవాఖాన మెడికల్ కాలేజీ వైద్యురాలిపై లైంగికదాడి, హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ నెల 20న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారధ్యంలోని బెంచ్ విచారించనున్నది. ఒకవైపు దేశవ్యాప్త నిరసనలు, మరొకవైపు హెల్త్ కేర్ సర్వీసుల నిలిపివేత నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ పీజీ ట్రైనీ విద్యార్థిని డ్యూటీలో ఉండగా లైంగిక దాడి, హత్యకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. రాష్ట్రాల్లో వైద్యులు ఆందోళన బాట పట్టారు. పౌర సమాజం నిరసనకు దిగారు. ఈ ఘటనలో నిందితులకు తీవ్రమైన శిక్ష విధించాలని, తమకు భద్రత కల్పించాలని వైద్యులు డిమాండ్ చేశారు.

ఇంతకుముందు సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తిలో ఉన్న ఇద్దరు న్యాయవాదులు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు లేఖ రాశారు. ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించాలని కోరారు. ‘క్రూరత్వంతో మూగబోయిన బాధితులకు ఈ కేసులో న్యాయ వ్యవస్థ ద్వారానే న్యాయం జరుగుతుందని యావత్ దేశం చూస్తోంది. ఇతరులకు సేవ చేయడానికి జీవితాన్ని అంకితం చేసిన యువ వైద్యురాలి మరణానికి తగిన న్యాయం చేకూర్చాలి. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.