Thursday, September 19, 2024
Homeఅంతర్జాతీయంమా దేశం వీడితే కొంత బ‌హుమ‌తి ఇస్తాం

మా దేశం వీడితే కొంత బ‌హుమ‌తి ఇస్తాం

Date:

వేరే దేశాల్లో పుట్టి ప్రస్తుతం స్వీడన్‌లో నివాసం ఉంటున్న పౌరులకు ఆ ప్ర‌భుత్వం కొత్త‌ పథకాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇతర దేశాల్లో జన్మించి అనంతరం స్వీడన్లో స్థిరపడిన పౌరులు దేశం వీడితే కొంత సొమ్మును బహుమతిగా ఇవ్వనుంది. అంతేకాకుండా వారి ప్రయాణ ఖర్చులు సైతం ప్రభుత్వమే భరిస్తుంది. ఆ దేశ ఇమిగ్రేషన్‌ మంత్రి మరియా మాల్మెర్‌ స్టెనార్గర్డ్‌ ఈ మేరకు వెల్లడించారు.

స్వీడన్‌లో నివసిస్తున్న వలసదారులు స్వచ్ఛందంగా దేశాన్ని వీడితే 10వేల స్వీడన్‌ క్రౌన్స్‌.. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ. 80 వేలు ఇస్తారు. చిన్నారులకు అందులో సగం అందజేస్తారు. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు. వీటితో పాటు వారి ప్రయాణానికి కావలసిన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ పథకాన్ని కేవలం వలసదారులకే వర్తింపజేసింది. ఇప్పటి నుంచి వేరే దేశాల్లో పుట్టిన స్వీడన్‌ పౌరులు(స్వీడన్‌ పాస్‌పోర్టు కలిగినవారు) దీన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఇందుకు ఇచ్చే గ్రాంట్‌ని సైతం పెంచుతున్నట్లు పేర్కొనింది.

20 ఏళ్లలో భారీగా పెరిగిన జనాభా..

ఇటువంటి విభిన్నమైన ప్రతిపాదనలు ఏర్పాటుకు ప్రధాన కారణం దేశ జనాభా పెరగడమే. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి స్వీడన్‌కు వలసలు వస్తుండడంతో గత 20 ఏళ్లలో జనాభా భారీగా పెరిగింది. 20లక్షలకు పైగా వలసదారులు ఉన్నారు. జనాభా నియంత్రణకు 2015లో వలసలపై ఆంక్షలు పెట్టినప్పటికీ అది పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో జనాభా నియంత్రణకు ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ‘వివిధ దేశాల నుంచి వలస వస్తున్న ప్రజలు స్వీడన్‌ వాతావరణంలో ఇమడలేకపోతున్నారు. అటువంటి వారికి ఇది గొప్ప అవకాశం’ అని ఇమిగ్రేషన్‌ మంత్రి మాల్మెర్‌ పేర్కొన్నారు.