Saturday, September 21, 2024
HomeUncategorizedరోడ్ల‌పై గుంత‌లు ఏర్ప‌డితే కాంట్రాక్ట‌ర్లే కార‌ణం

రోడ్ల‌పై గుంత‌లు ఏర్ప‌డితే కాంట్రాక్ట‌ర్లే కార‌ణం

Date:

రోడ్లు వేసిన కొన్ని రోజులుగా నాశ‌నమైపోతున్నాయి. నాసిర‌కం రోడ్ల‌పై గోవా ప్ర‌భుత్వం తీవ్రంగా స్పందించింది. 100 మందికిపైగా కాంట్రాక్టర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. రోడ్లపై గుంతల కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు ప్రభుత్వ ఇంజినీర్లే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. సీఎం ప్రమోద్‌ సావంత్‌ బుధవారం ప్రజా పనుల విభాగం సీనియర్‌ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వినాయక చవితి పండగ నాటికి రోడ్లపై గుంతలు కనబడకుండా చేయాలని ఆదేశించారు.

రోడ్లపై గుంతల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే సంబంధిత ఇంజినీర్లపై చర్యలు తీసుకోవాలని పీడబ్ల్యూడీ సీనియర్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇంజినీర్లతో పాటు 100 మందికి పైగా రోడ్డు కాంట్రాక్టర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు సీఎం తెలిపారు. కాంట్రాక్టర్లు ప్రాధాన్యతల ప్రాతిపదికన గుంతలను పూడ్చాలన్నారు. ఈ పనులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక భారాన్ని తీసుకోదని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లందరికీ అదనపు డబ్బు చెల్లించకుండా అక్టోబర్ తర్వాత రోడ్లను తిరిగి వేయాలని కోరనున్నట్లు తెలిపారు. వ్యవస్థ జవాబుదారీగా ఉండాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రత కోసం అనేక కఠినమైన చర్యలు తీసుకుంటోందన్నారు.