Thursday, September 19, 2024
Homeక్రైం50 గ్రాముల‌కు అంత‌ర్జాతీయ మార్కెట్లో రూ.850కోట్లు

50 గ్రాముల‌కు అంత‌ర్జాతీయ మార్కెట్లో రూ.850కోట్లు

Date:

బీహార్‌లోని గోపాల్ గంజ్ పోలీసులు అత్యంత విలువైన రేడియో యాక్టివ్‌ పదార్థం కాలిఫోర్నియంను స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. దాదాపు 50 గ్రాముల బరువున్న ఈ పదార్థం విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.850 కోట్లకు పైమాటే. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ స్వార్న్‌ ప్రభాత్‌ ధ్రువీకరించారు. నిందితులు ఈ పదార్థాన్ని అక్రమ రవాణా చేస్తున్నారని పేర్కొన్నారు.

మా జిల్లా నుంచి విలువైన రేడియో ధార్మిక పదార్థాన్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు ఓ టిప్‌ వచ్చింది. దీంతో మేం బృందాలు సిద్ధం చేశాం. డిస్ట్రిక్ట్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ను అప్రమత్తంగా ఉంచాం. స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌, ఎస్టీఎఫ్‌ దళాలను రంగంలోకి దించాం. వీరిని ఉత్తరప్రదేశ్‌-బిహార్‌ సరిహద్దుల్లో మోహరించాం. ఈ సమయంలో మోటార్‌ సైకిల్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా.. నాలుగు మొబైల్‌ ఫోన్లతోపాటు 50 గ్రాముల కాలిఫోర్నియం కూడా బయటపడింది. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర గ్రాము రూ.17 కోట్లు” అని ఎస్పీ ప్రభాత్‌ వెల్లడించారు. నిందితులను చోటే లాల్‌ ప్రసాద్‌, చందన్‌ గుప్తాగా గుర్తించారు. వీరు ఈ కాలిఫోర్నియంను విక్రయించేందుకు కొన్ని నెలలుగా యత్నిస్తున్నట్లు చెప్పారు. దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించామన్నారు. కాలిఫోర్నియంను పోర్టబుల్‌ మెటల్‌ డిటెక్టర్లలో వినియోగిస్తారు. వీటితో బంగారం, వెండి ఇతర విలువైన లోహాలను గుర్తించవచ్చు. దీంతోపాటు ఇంధన బావుల్లో నీరు, చమురు పొరలు గుర్తించేందుకు వాడతారు. ఇక విమానాల్లో లోహాల అరుగుదలను అంచనావేసేందుకు కూడా వినియోగించవచ్చు.