Sunday, September 22, 2024
HomeUncategorizedనీట్ ప‌రీక్ష ఏలా వాయిదా వేయగ‌లం..

నీట్ ప‌రీక్ష ఏలా వాయిదా వేయగ‌లం..

Date:

నీట్‌-పీజీ పరీక్షను వాయిదా వేసి విద్యార్థుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో వైద్య విద్య పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో చేరేందుకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఈ తీర్పుతో షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 11న (ఆదివారం) ఈ పరీక్ష జరగనుంది.

”ఇలాంటి పరీక్షలను ఎలా వాయిదా వేయగలం? ఈ మధ్యకాలంలో పరీక్ష వాయిదా వేయాలంటూ పలు పిటిషన్లు వస్తున్నాయి. ఇది పూర్తి పరిపూర్ణమైన ప్రపంచమేమీ కాదు. మేం విద్యావేత్తలం కాదు. ప్రాథమిక అంశాల ఆధారంగా.. మేం పరీక్ష తేదీని రీషెడ్యూల్ చేయలేం. దీనిగురించి రెండు లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఆ విద్యార్థుల జీవితాలను మేం ప్రమాదంలో పడవేయలేం. ఈ పిటిషన్ల వెనుక ఎవరున్నారో తెలీదు” అని కోర్టు వ్యాఖ్యానించింది. పరీక్ష వాయిదా కోరుతూ పిటిషన్లు వేసిన వారి తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే వాదనలు వినిపించారు. గత ఏడేళ్లుగా నీట్‌ పీజీ పరీక్షను నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ నిర్వహిస్తోంది. ఇప్పటివరకు పేపర్‌ లీకేజీ ఆరోపణలు రాలేదు. అయితే, నీట్‌-యూజీ 2024 పరీక్షపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీట్‌ పీజీ పరీక్షను సైతం కేంద్రం వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా 185 నగరాల్లో ఆగస్టు 11న కంప్యూటర్ ఆధారిత విధానంలో రెండు షిప్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఆధారంగా మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.