Sunday, September 22, 2024
HomeUncategorizedతెలంగాణ రాష్ట్రంలో ఉపఎన్నికలు తప్పవు..

తెలంగాణ రాష్ట్రంలో ఉపఎన్నికలు తప్పవు..

Date:

తెలంగాణలో ఉపఎన్నికలు తప్పవని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయిస్తామని హెచ్చరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్‌, ఎమ్మెల్యే హరీశ్‌రావు.. న్యాయకోవిదులతో చర్చలు జరిపారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో భారాస న్యాయపోరాటం చేస్తుందన్నారు. రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్‌ ప్రతినిధుల బృందం సమావేశమవుతుందని, బిఆర్ఎస్ తరఫున త్వరలోనే సుప్రీం కోర్టులో కేసు వేస్తామని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు.

దళిత మహిళపై ఇంత దారుణమా?

షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసుల దాడిని కేటీఆర్‌ ఖండించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మహిళపై ఇంత దాష్టీకమా? అని మండిపడ్డారు. ‘ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన? దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?’ అని ప్రశ్నించారు. రక్షించాల్సిన పోలీసుల దగ్గరే రక్షణలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. దాడికి పాల్పడిన పోలీసులపై వెంటనే ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత మహిళకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.