Sunday, September 22, 2024
HomeUncategorizedపైర‌సీల‌తో ఏటా రూ.20వేల కోట్ల న‌ష్టం

పైర‌సీల‌తో ఏటా రూ.20వేల కోట్ల న‌ష్టం

Date:

ప్ర‌స్తుత స‌మాజంలో రోజురోజుకి పైరసీ రక్కసి విజృంభిస్తుండటంతో చిత్ర పరిశ్రమ అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా పేర్కొన్నారు. ఒకప్పుడు చిత్ర పరిశ్రమకే పరిమితమైన పైరసీ ప్రస్తుతం అంటువ్యాధిలా ఓటీటీలకూ పాకిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా ఫిల్మ్‌ ఇండస్ట్రీకి ఏడాదికి రూ.20 వేల కోట్లు నష్టం వాటిల్లుతోందన్నారు. ఈ మేరకు శుక్రవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు.

కొవిడ్‌ మహమ్మారి తర్వాత ఓటీటీల పైరసీ 62శాతం పెరిగిందని రాఘవ్‌ చద్దా వెల్లడించారు. ఇది కళాకారుల సృజనాత్మకను దెబ్బతీయడంతో పాటు చిత్ర పరిశ్రమ ఆర్థిక స్థితిగతులు బలహీనం చేస్తోందన్నారు. గతేడాది సినిమాటోగ్రఫీకి సంబంధించి పాస్‌ చేసిన బిల్లులో థియేటర్‌లలో కెమెరా రికార్డింగ్‌ నిషేధంపై మాత్రమే దృష్టి సారించారన్నారు. ఆ బిల్లు ఇతర పైరసీలతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొలేదన్నారు. ఈ సమస్యను సమర్థంగా పరిష్కరించేందుకు కేంద్రం ప్రత్యేక చట్టాలు ప్రవేశపెట్టాలని కోరారు.