ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదేళ్ల వైకాపా పాలనలో అప్పుల్లో కూరుకు పోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఆదాయం, అప్పుల వివరాలను ప్రజల ముందుంచేందుకు సీఎం సిద్ధమయ్యారు. శుక్రవారం శాసనసభలో ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతుగా అధ్యయనం చేసిన కూటమి ప్రభుత్వం 2019-24 మధ్య పెండింగ్ బిల్లులు రూ.1,41,588 కోట్లు ఉన్నట్లు గుర్తించింది. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు రూ.వేల కోట్లు ఉన్నట్టు తేల్చింది.
పెండింగ్ బిల్లుల్లో రూ.93వేల కోట్లు సీఎఫ్ఎంఎస్లోకి అప్లోడ్ చేయలేదని, రూ.48వేల కోట్లు మేర బిల్లులు అప్లోడ్ చేసినా చెల్లింపులు చేయలేదని నిర్ధరించింది. భారీగా నీటిపారుదలశాఖ, పోలవరం బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వివిధ ప్రాజెక్టులకు చెందిన రూ.19,324 కోట్ల మేర బకాయిలు గుర్తించారు. ఆర్థిక శాఖ నుంచి రూ.19,549 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో రూ.14వేల కోట్లు, మున్సిపల్ శాఖలో రూ.7,700 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. మొత్తంగా రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్ల వరకు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ వివరాలను శ్వేతపత్రం ద్వారా ప్రభుత్వం వెల్లడించనుంది.