Tuesday, October 8, 2024
HomeUncategorizedదేశంలో బిఎస్ఎన్ఎల్ నష్టాలు తగ్గాయి

దేశంలో బిఎస్ఎన్ఎల్ నష్టాలు తగ్గాయి

Date:

దేశంలో ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ నష్టాలు తగ్గాయని కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌కు వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎబిటా రూ.2164 కోట్లు కాగా.. నష్టాలు రూ.5371 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో సంస్థకు వచ్చిన నష్టం రూ.8161 కోట్లతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. ఈ మేరకు కమ్యూనికేషన్స్‌ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఓ పార్లమెంట్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు బుధవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

కేంద్రం తీసుకుంటున్న చర్యలు, ఇస్తున్న ప్యాకేజీల కారణంగా బీఎస్ఎన్ఎల్‌/ ఎంటీఎన్ఎల్‌ 2020-21 నుంచి ఆపరేటింగ్‌ ప్రాఫిట్స్‌ అందుకుంటున్నాయని మంత్రి చెప్పారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ స్ఫూర్తితో 4జీ సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి బీఎస్ఎన్ఎల్‌ లక్ష 4జీ సైట్లను ఆర్డర్‌ చేసిందని, వీటిని సులువుగా 5జీకి అప్‌గ్రేడ్‌ చేయొచ్చన్నారు. బీఎస్ఎన్ఎల్‌, ఎంటీఎన్ఎల్‌ను పునరుద్ధరిచడానికి కేంద్రం అనేక చర్యలు చేపడుతోందని చెప్పారు. 2019లో రూ.69వేల కోట్లతో పునరుద్ధరణ ప్యాకేజీ కేంద్రం అందించిందని, 2022లో మరో రూ.1.64 లక్షల కోట్లు ప్యాకేజీ రూపంలో అందించిందని పేర్కొన్నారు. రూ.89 వేల కోట్ల విలువైన 4జీ/5జీ స్పెక్ట్రాన్ని 2023లో బీఎస్ఎన్ఎల్‌కు కేంద్రం కేటాయించిందని చెప్పారు.