ప్రశ్నపత్రం లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు, ప్రభుత్వ నియామక పోటీ పరీక్షల్లో అవకతవకల్ని నియంత్రించేందుకు బిహార్ అసెంబ్లీలో కీలక బిల్లును బుధవారం ఆమోదించారు.
బిహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) బిల్లు-2024ను రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి సభలో ప్రవేశపెట్టగా.. ప్రతిపక్షాల వాకౌట్ మధ్య మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది. నీట్-యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్, అక్రమాల ఆరోపణలపై చెలరేగిన వివాదానికి బిహార్ కేంద్ర బిందువుగా ఉన్న నేపథ్యంలో పోటీ పరీక్షల్లో అక్రమాలను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం గమనార్హం. ఈ బిల్లు ప్రకారం.. ఆయా పరీక్షల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారికి మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10లక్షల జరిమానాతో పాటు కఠినంగా శిక్షించనున్నారు.