Tuesday, October 8, 2024
HomeUncategorizedపరువు నష్టం దావా వేసిన అంజలి బిర్లా

పరువు నష్టం దావా వేసిన అంజలి బిర్లా

Date:

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కుమార్తె, ఐఆర్‌పీఎస్‌ అధికారిణి అంజలి బిర్లా ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ చేసిన సోషల్‌ మీడియా పోస్టులను తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. వృత్తిరీత్యా మోడల్‌ అయిన అంజలి బిర్లా 2019లో యూపీఎస్సీ పరీక్షలు రాశారు. తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత 2021లో కమిషన్‌లో చేరారు. అయితే, ఇటీవలే నీట్‌ – యూజీ పేపర్‌ లీక్‌ అంశం తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. దీంతో అంజలి వివాదం తెరపైకి వచ్చింది. 

తన తండ్రి ప్రభావంతోనే అంజలి తొలి ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిందంటూ సోషల్‌ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వాదనలను అంజలి కొట్టిపారేశారు. కొందరు సోషల్‌ మీడియా వేదికగా తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తనకు, తన తండ్రి పరువుకు నష్టం కలిగించే విధంగా పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు 16 ఎక్స్‌ ఖాతాల వివరాలను తన పిటిషన్‌లో పొందుపరిచి కోర్టుకు అందజేశారు. ఆ ఖాతాల్లో తనపై వచ్చిన పోస్టులను తొలగించాలని కోరారు. ఈ మేరకు పరువు నష్టం దావా వేశారు. అంజలి పిటిషన్‌ను విచారణకు హైకోర్టు స్వీకరించింది.