Tuesday, October 8, 2024
HomeUncategorizedలోక్‌సభలో నిర్మలమ్మ బడ్జెట్

లోక్‌సభలో నిర్మలమ్మ బడ్జెట్

Date:

లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. తాజా బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి కొన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించి, మరికొన్నింటిపై పెంచుతున్నట్లు తెలిపారు. దీని ఫలితంగా కొన్ని వస్తువుల ధరలు హెచ్చుతగ్గులకు గురికావచ్చు. తాజా బడ్జెట్ నిర్ణయాలతో ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయో ఒకసారి చూద్దాం

*ధరలు తగ్గే వస్తువులు*

*మొబైల్ ఫోన్లు*

మొబైల్ ఫోన్లు, వాటి ఛార్జర్లపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గించనున్నట్లు కేంద్ర ప్రభత్వం బడ్జెట్‌లో పేర్కొంది. దీంతో రాబోయే రోజుల్లో స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది.

*క్యాన్సర్ డ్రగ్స్*

క్యాన్సర్ ప్రాణంతక వ్యాధి. దీనికయ్యే చికిత్స కూడా భారీగా ఉంటుంది. దీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మూడు లేదా అంతకంటే ఎక్కువ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ డ్రగ్స్‌కు కస్టమ్స్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చింది. దీంతో రాబోయే రోజుల్లో క్యాన్సర్ మందుల ధరలు తగ్గనున్నాయి.

*బంగారం, వెండి*

కేంద్ర ప్రభుత్వం మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి తగ్గిస్తున్నట్లు బడ్జెట్‌లో వెల్లడించింది. దీంతో భవిష్యత్‌లో బంగారం, వెండి ఆభరణాలు ధరలు తగ్గవచ్చు.

*ప్లాటినం*

ఇటీవల కాలంలో బంగారం, వెండి ఆభరణాలతో పాటు ప్లాటినం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. తాజాగా బడ్జెట్‌లో ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీని 6.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

*సీఫుడ్*

తాజాగా బడ్జెట్‌లో బ్రూడ్ స్టాక్స్, రొయ్యలు, చేపల మేతపై బేసిక్ కస్టమ్స్ సుంకం 5 శాతానికి తగ్గించారు. ఫలితంగా రాబోయే రోజుల్లో రొయ్యలు, చేపల ధరలు తగ్గవచ్చు. బడ్జెట్‌లో ఈ ప్రకటన తర్వాత, సీఫుడ్ ఉత్పత్తుల సంస్థలు, ఎగుమతిదారుల షేర్లు పెరగడం గమనార్హం.

*సౌర శక్తి భాగాలు*

సౌరశక్తి సంబంధిత విభాగాలపై కస్టమ్స్‌ డ్యూటీని పొడిగించకూడదని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. సోలార్ సెల్స్, ప్యానెళ్ల తయారీలో ఉపయోగించే మూలధన వస్తువుల పన్ను మినహాయింపు జాబితా మరింత విస్తరించారు. దీని ఫలితంగా సోలార్ సెల్స్, ప్యానెళ్ల ధరలు తగ్గవచ్చు.

*చెప్పులు*

లెదర్, చెప్పుల తయారీపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తామని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. దీంతో రాబోయే రోజుల్లో చెప్పుల ధరలు కూడా తగ్గవచ్చు.

*క్రిటికల్ మినరల్స్*

కీలకమైన 25 ఖనిజాలను కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చారు. వాటిలో రెండింటిపై BCDని తగ్గిస్తారు. ఫెర్రోనికెల్, బ్లిస్టర్ కాపర్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తొలగించారు.

*ధరలు పెరిగే వస్తువులు*

*టెలికాం డివైజ్‌లు*

కొన్ని రకాల టెలికాం పరికరాలపై బేసిక్ కస్టమ్ డ్యూటీని 10% నుంచి 15 శాతానికి పెంచారు. దీని ఫలితంగా వాటి ధరలు పెరుగుతాయి.

*అమ్మోనియం నైట్రేట్*

అమ్మోనియం నైట్రేట్‌పై కస్టమ్స్ డ్యూటీ 10 శాతానికి పెంచారు. దీంతో దీని ధరలు కూడా పెరగనున్నాయి.

*నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్*

నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్‌పై కస్టమ్స్ డ్యూటీ 10%కి పెంచుతున్నట్లు బడ్జెట్‌లో ప్రస్తావించారు. దీంతో వీటి ధరలు కూడా పెరగనున్నాయి.