దేశంలో అత్యధిక చక్కెర, కొవ్వులతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగంతో స్థూలకాయం పెరుగుతోందని ఆర్థిక సర్వేలో ఆందోళన వ్యక్తమైంది. అత్యధిక చక్కెర, కొవ్వులతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగంపై అప్రమత్తత అవసరమని అభిప్రాయపడింది. దేశంలో 54 శాతం అనారోగ్య సమస్యలకు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే కారణమని సర్వే పేర్కొంది. పౌరులు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకునేలా దీనికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో ఒబెసిటీ అంశం ప్రస్తావనకు వచ్చింది.
దేశంలో ఒబెసిటీ ఆందోళనకరంగా మారిందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ముఖ్యంగా పెద్దల్లో స్థూలకాయం ఆందోళనకరమని పేర్కొంది. దేశంలో యువ జనాభా నుంచి ప్రయోజనం పొందాలంటే వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడంతో పాటు వారిని ఆరోగ్యకరమైన అలవాట్ల వైపు మళ్లించడం కీలకం అని అభిప్రాయపడింది. ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వెలువరించిన నివేదికను ఉటంకిస్తూ.. అధిక చక్కెర, కొవ్వులతో కూడిన ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగం కూడా విపరీతంగా పెరిగిందని సర్వే తెలిపింది. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం అధిక బరువు/ ఒబెసిటీకి కారణమవుతోందని విశ్లేషించింది. పెద్దల్లో స్థూలకాయం మూడింతలు పెరిగిందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. చిన్నారుల్లోనూ ఈ సమస్య వేగంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ విషయంలో వియత్నాం, నమీబియా తర్వాత స్థానంలో భారత్ ఉందంటూ వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ నివేదికను ఆర్థిక సర్వే ఉటంకించింది.
అర్బన్లోనే ఎక్కువ..
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం.. గ్రామీణ భారతంతో పోలిస్తే నగర జనాభాలో ఈ సమస్య అధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో స్థూలకాయ సమస్య 19.3 శాతం ఉండగా.. అర్బన్లో ఇది 29.8 శాతంగా ఉంది. 18-65 సంవత్సరాల వయసు కలిగిన పురుషుల్లో స్థూలకాయం సమస్య 18.9 శాతం నుంచి 22.9 శాతానికి పెరిగింది. అదే స్త్రీలలో 20.6 నుంచి 24 శాతానికి పెరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉందని సర్వే అభిప్రాయపడింది. మారుతున్న జీవన విధానమే దీనికి కారణమని విశ్లేషించింది. ఇందుకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో మహిళలు 41.3 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతుండగా.. పురుషుల్లో ఇది 38 శాతంగా ఉందని పేర్కొంది. తమిళనాడులో పురుష జనాభాలో 37 శాతం, మహిళా జనాభాలో 40.4 శాతం మందికి ఒబెసిటీ ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే పురుషుల్లో 31.1 శాతం, మహిళల్లో 36.3 శాతం మందిని స్థూలకాయం సమస్య వెంటాడుతోందని ఆర్థిక సర్వే పేర్కొంది.