Monday, October 7, 2024
Homeక్రైంకిడ్నీలు విక్ర‌యిస్తున్న ముఠా గుట్టుర‌ట్టు

కిడ్నీలు విక్ర‌యిస్తున్న ముఠా గుట్టుర‌ట్టు

Date:

దేశ రాజ‌ధాని ఢిల్లీ కేంద్రంగా కిడ్నీలు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. అయిదు రాష్ట్రాల్లో దాడులు జరిపి ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న పలువురు నిందితులను అరెస్టు చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన వారి కిడ్నీలను సేకరించి అవయవాలు అవసరమైన వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బంగ్లాదేశ్‌కు చెందిన కొంతమంది అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు.. దిల్లీలోని జసోలా విహార్‌లో రస్సెల్, రోకాన్‌, సుమోన్‌ మియాన్‌, రతేష్‌ అనే వ్యక్తుల్ని అరెస్టు చేశారు.

హరియాణా, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్, దిల్లీలో దాడులు చేసి మొత్తంగా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా నుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్‌లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ముగ్గురు బంగ్లాదేశ్‌కు చెందిన వారు ఉన్నారు. అరెస్టైన వారిలో నొయిడా ఆస్పత్రిలో అక్రమంగా ఆపరేషన్లు చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌ విజయ కుమారి ఉన్నారు. ఒక్కో ఆపరేషన్‌కు ఆమె రూ.2 నుంచి 3లక్షలు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా ప్రధానంగా బంగ్లాదేశ్‌కు చెందిన వారి కిడ్నీలను రూ.4 నుంచి 5 లక్షలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని సార్లు ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఎర వేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.