Monday, October 7, 2024
HomeUncategorizedవ‌ల‌స కార్మికుల‌కు రేష‌న్ కార్డులు ఇవ్వలేదా

వ‌ల‌స కార్మికుల‌కు రేష‌న్ కార్డులు ఇవ్వలేదా

Date:

దేశంలో వ‌ల‌స కార్మికులు రేష‌న్ కార్డుల కోసం ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకొని రోజులు గ‌డుస్తున్న‌ వెరిఫికేషన్‌ ప్రక్రియను ఆలస్యం చేస్తున్న రాష్ట్రాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఈ ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్రాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద కోటాతో సంబంధం లేకుండా వలస కార్మికులకు రాష్ట్రాలు రేషన్‌ అందించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై గతంలో విచారణ జరిపిన ధర్మాసనం.. ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న దాదాపు 8 కోట్ల వలస కార్మికులకు రేషన్‌ కార్డులు జారీ చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అయితే, ఇప్పటివరకు తెలంగాణ, బిహార్‌ రాష్ట్రాలు మాత్రమే వారికి రేషన్‌ కార్డుల జారీ కోసం 100శాతం వెరిఫికేషన్‌ పూర్తి చేశాయి.

పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ విషయాన్ని సీనియర్‌ అడ్వొకేట్‌ ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేగాక, కార్డులు జారీ అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు కార్మికులకు రేషన్ అందజేయడం లేదని తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు రేషన్‌ రావట్లేదని ఆయా రాష్ట్రాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. నాలుగు నెలలైనా వెరిఫికేషన్‌ ప్రక్రియను ఎందుకు పూర్తిచేయలేదు. ఇప్పుడు మరో రెండు నెలలు గడువు కావాలని అడుగుతున్నారు. దీన్ని మేం ఆమోదించలేం. నాలుగు వారాల్లోగా అన్ని రాష్ట్రాలు వలస కార్మికుల వెరిఫికేషన్‌ను పూర్తి చేయాలి. ఒకవేళ రాష్ట్రాలు విఫలమైతే.. ఆయా కార్యదర్శులకు సమన్లు జారీ చేస్తాం” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 27వ తేదీకి వాయిదా వేసింది.