తన పెళ్లి విందులో చేపల కూర లేకపోవడంతో పెళ్లి కొడుకు తన బంధువులతో కలిసి వధువు బంధువులను కొట్టాడు. ఈ గొడవలో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 11న వరుడు అభిషేక్ శర్మ తన కుటుంబం, బంధువులతో కలిసి పెళ్లి ఊరేగింపుగా ఆనంద్ నగర్ గ్రామానికి చేరుకున్నాడు. వధువు సుష్మ, అతడు పెళ్లి దండలు మార్చుకున్న తర్వాత వరుడి తరుఫు వారు విందు ఏర్పాటు చేసిన చోటుకు వెళ్లారు.
పనీర్, పలావ్తోపాటు వివిధ కూరలతో శాఖాహార వంటకాలు మాత్రమే ఉండటాన్ని వరుడు, అతడి బంధువులు గమనించారు. మాంసాహారం వంటలు లేవని తెలియడంతో ఆగ్రహించారు. చేపల కూర ఎందుకు లేదని ప్రశ్నించిన వరుడు అభిషేక్ శర్మ వధువు చెంపపై కొట్టాడు. తన బంధువులతో కలిసి వధువు తరఫు వారిపై దాడి చేశాడు. దీంతో ఇరువర్గాల వారు విచక్షణారహితంగా ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ఆరుగురు గాయపడ్డారు. మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేశారు. వరుడు అభిషేక్ శర్మతోపాటు అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.