Sunday, October 6, 2024
HomeUncategorizedఆరోప‌ణ‌లు నిజ‌మైతే ఐఏఎస్ పోయిన‌ట్టే..?

ఆరోప‌ణ‌లు నిజ‌మైతే ఐఏఎస్ పోయిన‌ట్టే..?

Date:

ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్క‌ర్ అధికార దుర్వినియోగానికి పాల్పడటంతోపాటు, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారన్న ఆరోపణలు రావడంతో కేంద్రం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ అదనపు కార్యదర్శి మనోజ్‌ ద్వివేదీ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. రెండు వారాల్లో ఆయన ఓ నివేదిక ఇవ్వనున్నారు. ఒకవేళ ఆ దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలితే పూజా ఖేద్కర్‌ను సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా నిజాలు దాచిపెట్టి, తప్పుడు మార్గంలో ఉద్యోగంలో చేరినందుకు ఆమెపై క్రిమినల్‌ చర్యలు కూడా తీసుకోవచ్చని తెలిపాయి.

ఖేద్క‌ర్‌ యూపీఎస్సీ అభ్యర్థిత్వంపైనా అనుమానాలు రేకెత్తాయి. తనకు నేత్ర, మానసిక సమస్యలు ఉన్నట్లు యూపీఎస్సీకి సమర్పించిన అఫిడవిట్‌లో ఖేద్కర్‌ పేర్కొన్నారు. 2022 ఏప్రిల్లో తొలిసారి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్‌ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు వైద్య పరీక్షలకు హాజరుకాలేదు. చివరికి ఆరోసారి పిలుపురాగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకున్నారు. దృష్టి లోపాన్ని అంచనా వేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరు కాలేదు. ఆమె సివిల్‌ సర్వీసెస్‌ అపాయింట్‌మెంట్‌ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్‌ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్‌ఫర్మ్‌ చేసుకుంది. పూజా ఓబీసీ ధ్రువీకరణ పత్రాలపైనా వివాదాలున్నాయి. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్‌ వచ్చినా ఐఏఎస్‌ హోదాను పొందగలిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిటీ నివేదిక కీలకంగా మారింది. ఆ నివేదికను బట్టే ఖేద్కర్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.