జీవితంలో గెలుపోటములు సహజమని, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీని కించపరిచే విధంగా మాట్లాడటం మానుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. జీవితంలో గెలుపోటములు సంభవిస్తుంటాయి. ఈ విషయంలో స్మృతీ ఇరానీతోపాటు ఇతర నేతలను కించపరిచే విధంగా మాట్లాడొద్దు. దురుసుగా ప్రవర్తించడం మానుకోవాలి. ఇతరులను కించపరచడం, అవమానించడం బలహీనతకు సంకేతం” అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్లోని అమేఠీ స్థానం నుంచి పోటీ చేసిన స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ నేత కిశోరీలాల్ శర్మ చేతిలో ఓటమిపాలయ్యారు. రాహుల్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కిశోరీలాల్.. ఇరానీపై 1.6లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ క్రమంలోనే ఆమెపై పలువురు విమర్శలు గుప్పిస్తుండటంపై రాహుల్ గాంధీ పైవిధంగా స్పందించారు.