Sunday, October 6, 2024
HomeUncategorizedఇంట్లో దోమలు ఉన్నాయ‌ని ఇంటి యజమానికి జ‌రిమానా

ఇంట్లో దోమలు ఉన్నాయ‌ని ఇంటి యజమానికి జ‌రిమానా

Date:

ఒక‌ వ్యక్తి, తన ఇంటి పరిసరాల్లో దోమలు విపరీతంగా పెరగడానికి కారణం అయినందుకు కోర్టు అతనికి రూ.2000 జరిమానా విధించింది. బ్లాక్ కుటుంబస్ధ్యకేంద్రం సూపర్‌వైజర్ కెబి జోబి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరింగలకుడ ఫస్ట్‌క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. కేరళ పబ్లిక్ హెల్త్ యాక్ట్ 2023 ప్రకారం రాష్ట్రంలో ఇలాంటిది ఇదే మొదటి తీర్పు అని ఆరోగ్య శాఖ తెలిపింది.

కేర‌ళ ఇరింగలకుడ మురియాడ్ పుల్లూర్‌ ప్రాంతంలో డెంగ్యూ జ్వరాలు విపరీతంగా వ్యాపించడంతో దోమలు వృద్ధి చెందకుండా చూడాలని వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. మురియాడ్‌కి చెందిన వ్యక్తి.. ఈ విషయంలో విఫలమవడంతో హెల్త్ సూపర్‌వైజర్ ఆయనపై కేసు పెట్టారు. అతని ఇంట్లో దోమల బెడద పెరిగే పరిస్థితులు నెలకొన్నాయని, శుభ్రం చేసేందుకు ఇంటి ఓనర్ సిద్ధంగా లేరని ఆరోగ్య పర్యవేక్షకుడు నివేదిక ఇచ్చారు.

కేరళ ప్రజారోగ్య చట్టంలోని సెక్షన్ 53(1) కింద కేసు నమోదైంది. జూన్ 26న ఈ కేసు కోర్టు ముందుకు వచ్చింది. ఇరింగలకుడ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ కేసును జూలై 10న విచారించింది. సవరించిన కేరళ ప్రజారోగ్య చట్టం అమలులోకి రాకముందు, బ్లాక్ మెడికల్ ఆఫీసర్‌కు మాత్రమే ఇలాంటి అంశాల్లో చర్యలు తీసుకునే అధికారం ఉండేది. సవరించిన చట్టం ప్రకారం, జూనియర్ హెల్త్ ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు తనిఖీ సమయంలో ఏదైనా ఉల్లంఘనలు కనుక్కుంటే, కేసు నమోదు చేయడానికి అధికారం ఉంది, ఆపై దానిని కోర్టుకు పంపవచ్చు. కోర్టు రూ.10,000 వరకు జరిమానా విధించవచ్చు. నిబంధనలు అమలులోకి రావడంతో జరిమానాలను కోర్టులు మాత్రమే విధిస్తాయి.