Sunday, October 6, 2024
HomeUncategorizedనీట్‌ తదుపరి విచారణ జులై 18కి వాయిదా

నీట్‌ తదుపరి విచారణ జులై 18కి వాయిదా

Date:

నీట్‌-యూజీ (2024) పరీక్షల అక్రమ వ్యవహారంపై మరోసారి విచారణ చేపట్టిన భారత సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది. తొలుత దీనిపై శుక్రవారమే విచారణ చేపడతామని చెప్పినప్పటికీ.. సొలిసిటర్‌ జనరల్‌ అభ్యర్థన మేరకు వాయిదాను పొడిగించింది. జులై 8న ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ వ్యవహారంపై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తమ స్పందనలు తెలియజేశాయి. ఆ అఫిడవిట్లు అందరు పిటిషన్‌దారులకు ఇంకా చేరలేదు. వాటిని పరిశీలించేందుకు వీలుగా సమయమిస్తూ తదుపరి విచారణ జులై 18కి వాయిదా వేస్తున్నాం’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పేర్కొన్నారు.

లీకైన ఆ నీట్‌ ప్రశ్నపత్రం బిహార్‌లోని ఒక్క పరీక్ష కేంద్రానికే పరిమితమైందని, విస్తృతంగా వ్యాప్తి చెందలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ సుప్రీంకోర్టుకు తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ ఇది వ్యాప్తి చెందలేదని పేర్కొన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన నివేదికను న్యాయస్థానానికి సీల్డ్‌ కవర్‌లో గురువారం అందజేసింది. నీట్‌ ప్రశ్నపత్రం లీకైనమాట వాస్తవమని తేలడంతో ఇందులో అవకతవకలు జరిగాయనడంలో ఎటువంటి సందేహం లేదని సుప్రీంకోర్టు ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఇది 23 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడి ఉన్నందున ‘మళ్లీ పరీక్ష’ నిర్వహణపై నిర్ణయం తీసుకునేముందు దీని విస్తృతి ఏమేరకు ఉందనే విషయం తెలుసుకోవాలని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఎన్‌టీఏ, కేంద్రంతోపాటు సీబీఐ నుంచి నివేదికలు కోరింది.