తెలంగాణ రాష్ట్రంలోని ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ కేసుపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జడ్జీలు, వాళ్ల కుటుంబ సభ్యుల పేర్లు మీడియాలో ప్రసారం చేయొద్దని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కొన్ని పత్రికల్లో జడ్జి పేరు, మొబైల్ నంబర్ ప్రచురించినట్లు హైకోర్టు ప్రస్తావించింది.
ఫోన్ ట్యాపింగ్పై మీడియా సంయమనం పాటించాలని, బాధ్యతతో వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేగాక, ఫోన్ ట్యాపింగ్ కేసు వార్తలు రాసేటప్పుడు మీడియా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ కేసులో ఇప్పటికే ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేశారని పేర్కొంది. అందుకే ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలనుకోవడం లేదని హైకోర్టు తెలిపింది. వారి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్ధాంతం చేయొద్దని హైకోర్టు హెచ్చరించింది.
జడ్జీలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఫొటోలు బహిర్గతం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జులై 23న కౌంటర్ దాఖలు చేస్తామని కేంద్రం చెప్పింది. దీంతో కేసును ఈ నెల 23వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసును హైకోర్టు సీజే బెంచ్ విచారిస్తోంది. కాగా, పలు రాజకీయ నేతలతో పాటు జడ్జీల ఫోన్లు ట్యాప్ చేశారని పత్రికల్లో కథనాల ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
ఇప్పటికే ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. కేసు విచారణ జరుగుతోందని, నిందితులను అరెస్టు చేసినట్లు కౌంటర్లో ప్రభుత్వం తెలిపింది. పలువురు పోలీసు అధికారుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు కౌంటర్ అఫిడవిట్లో పేర్కొంది. ఇందుకు సంబంధించి హైకోర్టు బుధవారం విచారణ చేపట్టగా రాష్ట్ర ప్రభుత్వానికి సంయమనం పాటించాలని స్పష్టం చేసింది.