Sunday, October 6, 2024
HomeUncategorizedజవాన్ల త్యాగానికి ప్రతీకారం తీర్చుకుంటాం

జవాన్ల త్యాగానికి ప్రతీకారం తీర్చుకుంటాం

Date:

కథువా ఉగ్రదాడి ఘటనపై ప్రతీకారం తప్పక తీర్చుకుంటామని భారత రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరామనె స్పష్టం చేశారు. దాడి వెనుక ఉన్న దుష్ట శక్తులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. ఉగ్రదాడిలో అమరులైన సైనిక కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘కథువాలోని బద్నోటాలో ఆర్మీ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లను కోల్పోవడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సైనికుల నిస్వార్థ సేవలను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది. వారి త్యాగానికి ప్రతీకారం తీర్చుకుంటాం. దాడి వెనుక ఉన్న దుష్ట శక్తులను భారత్ మట్టుబెడుతుంది’ అని పేర్కొన్నారు.

జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో భారత సైనికులు జరిపిన ఎన్‌కౌంటర్లపై ఉగ్రవాదులు ప్రతీకార దాడికి పూనుకున్నారు. సోమవారం భారత ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఐదుగురు జవాన్లు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. కథువా జిల్లాలోని మాచేడి ప్రాంతంలో ఉగ్రవాదులు కొండపై నుంచి గ్రనేడ్లు, ఇతర మారణాయుధాలతో ఈ దాడి చేశారు. వెంటనే తేరుకున్న సైనికులు ఎదురుకాల్పులు జరుపగా, ఉగ్రవాదులు పారిపోయారు. వారి కోసం గాలింపు జరుగుతున్నది. మరోవైపు రాజౌరీ వద్ద మాఝకోట్‌ సైనిక శిబిరంపై ఆదివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక జవాన్‌కు గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఆర్మీ ఎదురుకాల్పులకు దిగడంతో ఉగ్రవాదులు పరారయ్యారు.